సరైన వసతులు కల్పించని ప్రభుత్వ చర్యలకు నిరసనగా వరద బాధితులు నూతన విధానంలో నిరసన వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా రామప్పచెరువు పొంగడంతో ఇంచెర్ల గ్రామం ముంపునకు గురైంది. దాంతో సుమారు 50 కుటుంబాలను బ్రాహ్మణి స్కూల్ కు తరలించారు.
అక్కడ వారికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే వరద బాధితులకు ఉడికి ఉడకని అన్నం పెట్టడం, వారిని చిన్న చూపు చూడటం తో వారికి అనుమానం వచ్చింది. పాపం ఈ ప్రభుత్వం దగ్గర తమకు అన్నం పెట్టేందుకు డబ్బులు లేవేమోనని వారు ఆలోచించారు.
తమకు ఖర్చు చేసేందుకు డబ్బులు ఉంటే ఉన్న 50 కుటుంబాలకు అన్నం పెట్టకుండా కేవలం 60 మందికే భోజనం పంపిస్తారా అని వారు ఆలోచించారు. వరద బాధితులకు ఒక్కొక్కరికి 130 రూపాయలు భోజనానికి 25 రూపాయలు టిఫిన్ కు ప్రభుత్వం కేటాయించిందని అధికారులు చెబుతున్నారు కానీ అలాంటి చర్యలు ఏవీ కనిపించలేదు.
దాంతో వరద బాధితులే చందాలు వేసుకుని ప్రభుత్వానికి సాయం చేద్దామని అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు నేడు చందాలు కూడా పోగు చేశారు. ఈ చందా సొమ్మును ప్రభుత్వానికి పంపుతామని ముసినిపెళ్లి కుమార్ గౌడ్, జక్కుల చిన్న రవి, ఉడుత వీరాస్వామి, ఇట్టవేణి రమేష్, ఒజ్జల రవి, మాదాసు శ్రీనివాస్ తదితరులు అంటున్నారు.