కరోనా నేపథ్యంలో ప్రతిపాదన దశలో నిలిచిపోయిన అదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని పెండింగ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి పనులు సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపూరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విన్నవించారు.
సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తో కలిసి ఎంపీ వినతి పత్రం సమర్పించారు.
అదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు పెండింగ్లో ఉన్న రైల్వే లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అదిలాబాదులో ఇండియన్ ఎయిర్ పోర్ట్ అథారిటీ పరిశీలనలో ఉన్న ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
అదిలాబాదులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడం వల్ల పనులు మొదలు కావడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించాలా చూడాలన్నారు.
ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జిల్లా లో పరిధిలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర హోం శాఖ ద్వారా రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎంపి కోరారు. వెనుకబడిన అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ముఖ్యంగా ఆసిఫాబాద్ కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి కేంద్రం దృష్టి సారించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా ఎంపీ సోయం బాపూ కోరారు.
ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులోని చంద్రాపూర్ అంతర్రాష్ట్ర రహదారి పనులకు నిధులు మంజూరు అయినందున ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జందాపూర్ నుండి కరంజీ వరకు 40 కిలోమీటర్ల పొడవున బిటి రోడ్డు నిర్మాణం లింకేజీ కోసం నిధులు మంజూరు చేయాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. కేంద్ర మంత్రి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.