ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో ఖాళీ అయిన రెండు స్థానాల భర్తీపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తుది కసరత్తు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నా ఇద్దరి పేర్లపై దాదాపుగా ఆయన నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు.
మంత్రి వర్గంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభ సభ్యులుగా వెళ్లిపోవడంతో మంత్రి వర్గంలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండు స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు కీలకమైన శాఖలు నిర్వహించడమే కాకుండా పలు విధాన నిర్ణయాలలో కీలక పాత్ర పోషించారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పని చేశారు. అలాంటి వారితోనే మళ్లీ ఆ స్థానాలు భర్తీ చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా నుంచి ఈ సారి మంత్రి వర్గంలో అనంత వెంకటరామిరెడ్డికి స్థానం దగ్గబోతున్నట్లు తెలిసింది. అనంత వెంకటరామిరెడ్డి చాలా కాలంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి విధేయుడుగా ఉన్నారు.
సీనియర్ రాజకీయ నాయకుడు కూడా అయినందున అనంత వెంకటరామిరెడ్డి సేవలు పార్టీకి ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. దాంతో ఆయనకు ఈ సారి మంత్రి వర్గంలో బెర్తు ఖాయమని అంటున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంతో నమ్మకస్తుడు, ఎంఎల్ సి జంగా కృష్ణమూర్తికి ఈ సారి మంత్రి వర్గంలో స్థానం దాదాపుగా ఖరారైందని అంటున్నారు.
ఎంతో విధేయత చూపే జంగా కృష్ణ మూర్తి బలహీన వర్గాల నాయకుడుగా మంచి పేరు ఉన్నది. ఈ కారణంతో ఆయన మంత్రి పదవి దాదాపుగా ఖరారైందని అంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ తేదీ ఖరారు కాలేదు కానీ ఎప్పుడు జరిగినా వీరికి పదవులు ఖాయంగా కనిపిస్తున్నది. అదే విధంగా చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ ను కౌన్సిల్ కు పంపుతారని కూడా అంటున్నారు.