కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశం, రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నందున చాలా మంది నిరుపేదలు, రోజువారీ కూలీలు పనిలేక తిండి లేక అవస్థలు పడుతున్నారు. దీన్ని గమనించిన ఎల్లారెడ్డి విలేకరులు ప్రెస్ క్లబ్ తరపున పట్టణంలోని గాంధీ చౌక్ లో గురువారం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు పరుస్తున్నందున ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో లాక్డౌన్ కొనసాగినంత వరకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని, ఎవరు తిండి లేక బాధ పడకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అన్నారు. దీనికొరకు దాతల నుండి ఎటువంటి విరాళాలు స్వీకరించమని, విలేకరులు మాత్రం తోచినంత సహాయం చేయాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఈ అన్నదాన ప్రారంభ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం , ఆర్డిఓ దేవేందర్ రెడ్డి, సిఐ రాజశేఖర్, తహసీల్దార్ స్వామి, ఎస్సై శ్వేతా తదితరులు పాల్గొన్నారు.