ఈనాటి జయజయ ధ్వానాలు శ్రీరాముడికి వినిపించకపోవచ్చు కానీ, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తులకు వినిపిస్తాయి. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం నా మహద్భాగ్యం. ఈ మహద్భాగ్యాన్ని రామమందిరం ట్రస్టు నాకు కల్పించింది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జై శ్రీరామ్ నినాదాలతో మోదీ తన ప్రసంగం ప్రారంభించారు. పురుషోత్తముడికి భవ్య మందిర నిర్మాణం ప్రారంభమైందని, రాముడి ఆదర్శాలు కలియుగంలో పాటించేందుకు మార్గమిదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ మందిర నిర్మాణం జాతీయ భావనగా ఆయన చెప్పారు. కోట్లాది మంది మనో సంకల్పానికి ప్రతీక ఈ మందిరం అని ఆయన అన్నారు. దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో నిండిపోయింది. దేశమంతా రామమయమైంది. ప్రతి ఒక్కరి మనసు దేదీప్యమానమైంది.
గుడి, టెంటులో ఉన్న రామమందిరం ఇకపై భవ్యమందిరంగా మారబోతోంది. విశ్వవ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు మారుమోగుతున్నాయి. రాముడు అందరి మనస్సుల్లో నిండి ఉన్నారు. శ్రీరాముడు అంటే మర్యాద పురుషోత్తముడు అని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రామనామం జపించే భక్తులు ఉన్నారని ప్రధాని తెలిపారు.
కంబోడియా, మలేషియా, థాయ్లాండ్లో రామాయణ గాథలు ప్రసిద్ధి చెందాయని, శ్రీలంక, నేపాల్ లో రాముడు, జానకిమాత కథలు వినిపిస్తాయని ఆయన తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎందరో త్యాగాల ఫలితం. రామ మందిరం కోసం ఆత్మత్యాగం చేసిన వారికి 135 కోట్ల మంది తరఫున ధన్యవాదాలు.
రాముడి ప్రేరణతో భారత్ ముందుకెళ్తుందని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణం శిలా ఫలకాన్ని మోదీ ఆవిష్కరించారు. రామమందిరం నిర్మాణ చిహ్నంగా పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భగవత్ తదితరులు పాల్గొన్నారు.