సగంలో ఆగిన స్థానిక సంస్థల ఎన్నికలను తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఉన్నప్పుడు అంటే మార్చి 15న ఎంపిటిసి, జెడ్ పిటిసి, గ్రామ పంచాయితీ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులను సమర్థించింది. తదనంతర పరిణామాలలో గ్రామ పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడంపై సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై కూడా కోర్టు ఉత్తర్వులు ఇస్తూ రంగులను తీసేయాల్సిందిగా ఆదేశించింది. ఇందుకు మూడు వారాలు సమయం ఇచ్చింది.
అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పడు కరోనా వ్యాధి విస్తరణకు సంబంధించిన లాక్ డౌన్ పొడిగింపు నిబంధనలు జారీ చేస్తున్నది. ఈ కారణాలతో ఆగిపోయిన ఎన్నికలను తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ మరలా తిరిగి నిర్వహించరాదని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తాము ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంటామని సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని ఎన్నికల కమిషనర్ వి కనగరాజ్ తెలిపారు.