ప్రపంచ మహమ్మారి కరోనా విషయం లో ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు వేస్తూ నిరంతరం పోరాడుతున్న పోలీసులు, తాము వేసుకున్న ఖాకీ వెనకాల వెన్న వంటి మనస్సు ఉందని నిరూపించుకుంటున్నారు. ఆ మనసు సరియైన సమయంలో స్పందిస్తుందని మరోసారి నిరూపించారు.
తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ పాత్రికేయుని అభ్యర్థన పై తక్షణమే స్పందించి మైదుకూరు D.S.P విజయ్ కుమార్ తమ మానవత్వాన్ని మరో సారి నిరూపించుకున్నారు. కడప జిల్లా దువ్వూరు కు చెందిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుడు నరసింహ కొద్ది రోజులుగా టై ఫాయిడ్ తో బాధపడుతూ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
తన అనారోగ్యంపై ఆందోళన చెందిన అతడు తనను ఆసుపత్రిలో చేర్పించి ఆదుకోవాలని వాట్సాప్ గ్రూపుల ద్వారా అభ్యర్థించాడు. అదే సమయంలో నియోజకవర్గ పరిధిలోని విలేకరులు, జిల్లా కేంద్రంలోని పాత్రికేయులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు.
వెంటనే స్పందించిన ఎస్పీ అన్బు రాజన్, విలేకరి నరసింహ కు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని మైదుకూరు డీఎస్పీ ని ఆదేశించారు. డిఎస్పీ విజయ కుమార్ దువ్వూరు చేరుకుని రూరల్ సీఐ కొండారెడ్డి తో కలిసి నరసింహను వాహనంలో జిల్లా కేంద్రం కడప రిమ్స్ కు తరలించారు. అదే విధంగా ఖర్చుల నిమిత్తం డీఎస్పీ స్వయంగా కొంత నగదును నరసింహకు అందచేసి పెద్ద మనసును చాటుకున్నారు.
ధైర్యంగా ఉండమని అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దువ్వూరుS.I కుళాయప్ప, మైదుకూరు ఎలక్ట్రానిక్ మీడియా దువ్వూరు ప్రింట్ మీడియా విలేఖరులు నరసింహ ను కలిసి పరామర్శించారు.