ప్రజా గాయకుడు, విప్లవ కళాకారుడు గద్దర్ మరణం విప్లవ, ప్రజా సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఆయనకు సిపిఎం జిల్లా కమిటి పక్షాన విప్లవ జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పేదలు, కార్మిక, కర్షక శ్రామిక జనావళిపై భూస్వాములు, పెత్తందార్లు, దోపిడీ పాలక వర్గాలు సాగిస్తున్న దోపిడిని, అణచివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన వ్రాసిన పాటలు తుపాకి తూటాలై ప్రజల్లో వర్గ కసిని రగిలించాయి.
కార్మికుల వేతనాలు, పేదలకు భూమి, కూలి, పోడు పోరాటాలకు, వర్గ ఉద్యమాలకు ఆయన సృష్టించిన సాహిత్యం మందుగుండై పేలిందన్నారు. ఖమ్మం జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ సిపిఎం సార్థ్యంలో సాగిన ప్రజా సామాజిక సంఘాల వేదిక (టి-మాస్) లో భాగస్వామి అయిన గద్దర్ పాటలు, మాటలతో వర్గ సామాజిక చైతన్యాన్ని కలిగించారని గుర్తు చేశారు.