కర్నూలు జిల్లా పసుపుల గ్రామపంచాయతీ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను కర్నూల్ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ నోట్ల ముఠాలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందినవారు ఉండడంతో గ్రామంలో కలకలం రేగింది. కర్నూల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నూల్ శివారులో రెండు ముఠాలు నకిలీ నోట్లు మార్పిడి చేసుకుంటుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఒక ముఠా రూ.90 లక్షలు ఇస్తే, రెండో మూఠా రూ.30 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
మొదటి ముఠా నుంచి రూ.87.50 లక్షలు, రెండో ముఠా నుంచి రూ. 16.30లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రెండో గ్రూప్లో గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందిన జనంపల్లి చంద్రశేఖర్ రెడ్డి, భీమ్ పోగు చిన్న నాగన్న, చాకలి బ్రహ్మ ఉన్నారు.
ఈ దొంగ నోట్ల మార్పిడిలో క్యాతూర్ గ్రామానికి చెందిన వారు అరెస్ట్ కావడం.. ముగ్గురిలో ఒక వ్యక్తి గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇంకా ముఠాతో ఎంతమందికి సంబంధం ఉందోనని చర్చించుకుంటున్నారు.