ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో యువత పెడదారి పట్టకుండా టెక్నాలజీలోని మంచిని స్వీకరించి చెడును తిరష్కరించాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఏది మంచి, ఏది చెడు అని విశ్లేషించుకొని తమ కెరీర్ కు నష్టం కలగకుండా చూసుకుంటూ యువత ఆరోగ్యకరమైన సమాజానికి నడుం కట్టాలని పేర్కొన్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కు వచ్చిన ఆమె కొండకరకాం వద్ద గిరిజన విశ్వవిద్యాలయం లో విద్యార్ధులకు కెపాసిటీ బిల్డింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై సెమినార్ జరిగింది.
ఈ సెమినార్ కు పద్మ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. యువతకు ఇలాంటి కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలు వారి కెరీర్ లో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్ధులు కేవలం మార్కు ల కోసమే చదవకుండా ప్రాక్టికల్ నాలెడ్జ ను పెంపొందించు కోవాలని, కళాశాలల్లో కూడా తప్పనిసరిగా నైపుణ్య కోర్సు లు పెట్టి వాటిలో శిక్షణ ఇవ్వాలని న్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఏ కోర్సు కు డిమాండ్ ఉందొ ఆ కోర్సులలో శిక్షణ ఇవ్వాలన్నారు.
విద్యార్ధులు వత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుకోవాలని, సెల్ఫ్ మోటివేషన్ ను మించినది మరొకటి లేదని, వారి పరిస్థితులు, పరిమితులు తెలుసుకుని కెరీర్ ను తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. సోషల్ మీడియా వలన తమ కెరీర్ కు హాని కలిగించే పరిస్థితుల్ని గుర్తెరిగి మసలుకోవాలన్నారు. ఆడ పిల్లలు ఇలాంటి అవగాహనా తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఒకప్పటి పరిస్థితులు లేవని ఆడ పిల్లల జీవితాల్లో అనేక మార్పులు సంభవించాయని, ప్రభుత్వం కూడా చదువు కోసం అనేక అవకాశాలను కల్పిస్తోందని అన్నారు. బాల్య వివాహాలు, చదువు మానివేయడం అన్నిటికీ పేదరికమే కారణం అవుతోందని, ఈ పేదరికాన్ని జయించి అందరూ చదువుకునేలా ప్రభుత్వం విద్యనూ ప్రోత్సహిస్తోందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలను, పాఠశాలలను బలోపేతం చేస్తేనే పేదవారికి విద్యా అవకాశాలు లభిస్తాయని భావించి ప్రభుత్వం నాడు నేడు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పధకాలను అమలు చేస్తోందన్నారు.
వైద్య రంగం లో కూడా ఫ్యామిలీ డాక్టర్ ఫిజిషియన్ కాన్సెప్ట్ తో ప్రజల ముంగిటకే వైద్యాన్ని అందించడం జరుగుతోందన్నారు. గిరిజనుల కోసం ఒక ప్రత్యెక యూనివర్సిటీ ని నెలకొల్పడం గొప్పవిషయమని, భవిష్యత్తు లో అతి పెద్ద కాంపస్ గా వెలుగొంది అనేక మంది విద్యార్ధులకు చక్కటి అవకాశాలను కల్పించాలని ఆకాంక్షించారు.
మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అనేక బాల్య వివాహాలు జరుగుతున్నాయని, ఈ వ్యవస్థను మార్చడం లో యువత కీలక పాత్ర వహించాలని అన్నారు. అదే విధంగా లింగ వివక్ష లేని సమాజానికి నడుం కట్టాలని పిలుపునిచ్చారు.
సభాధ్యక్షత వహించిన గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కట్టిమణి మాట్లాడుతూ యువత ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని సాధించడమే కర్తవ్యంగా భావించాలని అన్నారు. నూతన విద్యా విధానం లో కంపల్సరీ అప్ప్రెంట్షిప్ అనే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనివలన ప్రతి విద్యార్ధి కి నైపుణ్యం వస్తుందని, తద్వారా ఉపాధి సులువుగా పొందగలరని అన్నారు. నేర్చుకోవడం అనేది నిత్య ప్రక్రియ అని ఎర్నింగ్ తర్వాత కూడా ఎలా ఖర్చు పెట్టాలనే విషయాన్నీ లెర్నింగ్ ద్వారా నే తెలుసుకోగలరని చమత్కరించారు.
ఈ కార్యక్రమం లో లెండి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హరిబాబు తమ్మినేని, బయో టెక్ డిపార్టుమెంటు హెచ్ ఓ డి డా. శ్రీదేవి, డా. దివ్య , డా. వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ ఎన్.ఏ.డి పాల్ తదితరులు కెపాసిటీ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ పై అవగాహన కలిగించారు. సమావేశం అనంతరం ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియా తో మాట్లాడారు. లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మించాలని, , మగ వారు మారాలని ఈ తరం ఆడ పిల్లలు కోరుకుంటున్నారని, సమాజం లో సగ భాగమైన ఆడవారిని హేళన చేస్తూ ,అవమానిస్తే ఆ సమాజం ఎలా ముందుకు నడుస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు మహిళల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకు లుగానే చూసాయని ఆడవారి గురించి ఆలోచన చేయని విజనరీ ఎందుకని ఎద్దేవా చేసారు.