ఏడవ రోజుకు చేరిన జిహెచ్ఎంసి కాప్రా కార్మికుల సమ్మె
జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారం నాటికి ఏడవ రోజుకు చేరుకుంది. శ్రావణ శుక్రవారం అయినప్పటికీ మున్సిపల్ మహిళా కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడం విశేషం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో సమ్మె చేశారు. ఈ సందర్భంగా వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్కిల్ కార్మికులను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ బి బ్లాక్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిహెచ్ఎంసి లోని సుమారు 25 వేల మంది కార్మికులు గత ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు.
ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీని మాత్రమే అమలు చేయమంటున్నామని అన్నారు. 2014లో ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అధికారంలోకి రాగానే పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కార్మికులందరినీ పర్మినెంట్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. శుక్రవారం ఏఎస్ రావునగర్ డివిజన్ బీజేఆర్ కాలనీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రహీం సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు సంఘీభావం ప్రకటించి సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల న్యాయమైన కోరికను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కాప్రాలోని వివిధ యూనియన్ల నాయకులు కె. శివ కృష్ణ, సునీల్ మనోహర్, రామ రాజేశ్వర్, యాకస్వామి, కుర్మన్న, సుజాత, మంజుల, అంజలి, శ్యామల, శివయ్య, సాయిలు, బి. పరమేష్, ఎస్. నరసింహ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా