కరోనా వ్యాధి ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించే బత్తాయి పండ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంపిణీ చేసేందుకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచన మేరకు నకిరేకల్ నియోజకవర్గంలోని చెరువు అన్నారం గ్రామం నుండి భారీగా బత్తాయి లను కొనుగోలు చేయనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక శాసనసభ్యుడు,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వెల్లడించారు.
ఇద్దరు ఎమ్మెల్యేలు నేడు చెరువు అన్నారం గ్రామంలో బత్తాయి తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఇక్కడ బత్తాయి సాగు చేసే విధానాన్ని వివరించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ ప్రాంతంలో కరోనా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరికీ బత్తాయి పండ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.
అనంతరం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బత్తాయి తోటలు లేవని, సీఎం కేసీఆర్ సూచనల మేరకు తన మిత్రుడైన నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య కోరిక మేరకు ఇక్కడి నుంచి బకాయిలను కొనుగోలు చేసి బత్తాయి రైతులకు చేయూత అందించడంతోపాటు తన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ లందరికీ బత్తాయిలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.