విధి నిర్వహణలో ఉన్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు విచక్షణారహితంగా నరికి చంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రగొండ మండలం బెండలపాడు వద్ద ఎర్రబోడు అటవీప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఈ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటారు. స్థానిక గిరిజన జాతి అయిన గుత్తికోయలు అధికారులు నాటిని మొక్కలను తొలగించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. అనేక సార్లు ఫారెస్ట్ అధికారులకు ,గొత్తికోయలకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఆ భూముల్లో మరోసారి మొక్కలు నాటగా, వాటిని ధ్వంసం చేసేందుకు గిరిజనులు యత్నించారు. ఈ క్రమంలో ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు (42) అడ్డుకోగా, గుత్తికోయలు ఆయనపై వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను అటవీశాఖ సిబ్బంది ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆ ఫారెస్ట్ రేంజర్ ప్రాణాలు వదిలారు.
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు పై గుత్తి కోయల దాడిలో మృతి చెందిన శ్రీనివాసరావు మృతి పట్ల సిఎం కేసిఆర్, మంత్రి పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిందితులను విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు. ఈ విషయమై డిజిపి మహేందర్ రెడ్డి ని సిఎం కేసిఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ లంచనలతో అంత్యక్రియలు జరపాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించింది. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుంటే… విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేయడం సరికాదని సిఎం అభిప్రాయపడ్డారు. అటవీ ఆక్రమణలను సహించేది లేదని, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అటవీ అధికారులు మనోస్థైర్యం కొల్పోవద్దని వారు ధైర్యం చెప్పారు.