జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) జారీ చేసిన నోటీసులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒక కాంగ్రెస్ నేత ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ అసత్య ఆరోపణలని ట్విటర్లో పేర్కొన్నారు.
హిమాయత్ సాగర్ పరీవాహక ప్రాంతంలో ఎలాంటి పర్మినెంట్ కట్టడాలు నిర్మించకుండా నిరోధించే 111 జీవో( త్రిబుల్ వన్ జీవో) నిబంధనలకు విరుద్ధంగా జొన్నాడ గ్రామంలో మంత్రి కేటీఆర్ ఒక ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారని మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కమిటీని నియమించింది.
అంతే కాకుండా త్రిబుల్ వన్ జీవోపై గతంలో తాము ఇచ్చిన తీర్పులు అమలు జరుగుతున్నాయా లేదా అనే విషయంపై కూడా పరిశీలించాలని కమిటీని కోరింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ఓ కాంగ్రెస్ నాయకుడు నాపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం ఉద్దేశపూర్వకమే. గతంలో చెప్పినట్లుగా ఆ ఫామ్హౌజ్ నాది కాదు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే. సరైన న్యాయ సలహాలు తీసుకుని నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తానని’ కేటీఆర్ ట్వీట్ చేశారు.