కరోనా బారిన పడ్డ పోలీసు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తక్షణమే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందివ్వాలని గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇంకా ఈ కరోనా కట్టడి అయ్యేంత వరకూ, రాబోయే కొన్ని నెలల కాలం కుటుంబాన్ని వదులుకొని డ్యూటీ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహించి బాగా పనిచేసిన వారందరినీ కూడా అభినందించాలని ఆయన కోరారు. అదేవిధంగా మిగతా డిపార్ట్ మెంట్ లలో ఎవరైతే బాగా పని చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా తప్పకుండా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనా కట్టడి చేయడంలో రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడిన పోలీస్, హెల్త్, రెవెన్యూ, పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం ప్రత్యేక తరగతి క్రింద కేటాయించి గుర్తింపు ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వారికి డబుల్ శాలరీ ఇవ్వాలని, పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.10 వేలు అదనంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.