కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సంచార జాతుల గురించి ఆలోచించాలని సంచార జాతుల జాతీయ సంఘం ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి సత్యనారాయణ కోరారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంచార జాతులను పట్టించుకోకపోతే అతి తీవ్ర పరిణమాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన అన్నారు. నిలువ నీడలేకుండా, పేదరికంలో మగ్గుతూ రోజు వారి కూలీపై పని చేస్తున్న సంచార జాతుల వారు లాక్ డౌన్ కారణంగా పస్తులు ఉండి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మరి తో నేడు సుమారు 196 ప్రపంచ దేశాలు అల్లాడుతూ ప్రజలు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం లో కరోనా వైరస్ మహమ్మరిని తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్య రక్షణకు ఇంటి నుండి బయటకు తిరగకుండా లాక్ డౌన్ ప్రకటించారు.
ఈ నేపధ్యంలో రెక్కడితే డొక్కాడని సమస్త సంచార జాతుల కులాల వారికి తెల్లవారక ముందే ఊరు వాడ ఇంటింటికి తిరుగుతూ జీవనం సాగిస్తున్న సంచార జాతుల వారికి ఇది కష్టతరమైన విషయం అని గుండ్లపల్లి సత్యనారాయణ అన్నారు.
సంచార జాతుల కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ. 3000 అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సంచర జాతులను అర్ధికంగా అభివృద్ది పరచేందుకు ఏర్పడిన ఎంబిసి కార్పొరేషన్ నుండి సంచార జాతులకు తక్షణ ఆర్థిక సహాయం ఇవ్వాలని, నిత్యవసర వస్తువులు అందించాలని కోరారు.
ఎంబిసి చైర్మన్ తడూరి శ్రీనీవాస్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని సంచార జాతుల కులాలకు ఆర్థిక సహాయం అందేలా చూడాలని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.