కార్మిక ,కర్షక, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని సిఐటియు తెలంగాణ వ్యవసాయ, కార్మిక రైతు సంఘాల జిల్లా నాయకులు అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ తాహసీల్దార్ కార్యాలయం ఎదుట నేడు నిరసన వ్యక్తం చేసి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం CITU జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి మాట్లాడుతూ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రతి మనిషికి పది కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని, కరోనా నివారణకు ముందుండి పని చేస్తున్న ఆశ, అంగన్వాడి, జాతీయ హెల్త్ మిషన్ సిబ్బందికి ఉచిత చికిత్స అందివ్వాలని డిమాండ్ చేశారు.
50 లక్షల ప్రమాద భీమా,ఇతర అలవెన్సులు ఇవ్వాలని ఆయన కోరారు. పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ చట్టం అమలు చేసి కూలీలకు 200 రోజులు పనులు కల్పించి రోజు కూలీ పెరిగిన ధరలకు అనుగుణంగా 600 రూపాయలు ఇవ్వాలని, కరోనా వైరస్ రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని ఆయన కోరారు.
పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయడానికి ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయాలని, బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని,రేషన్ షాపులలో కిరోసిన్, చక్కెర వెంటనే ఇవ్వాలని ఆయన కోరారు.
అదే విధంగా స్కీం వర్కర్లకు నెలకు ఇరవై ఒక్క వేల వేతనం,10వేలు పెన్షన్ ఇవ్వాలని, కార్మిక చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని, పరిశ్రమలలో పనిచేసే కార్మికులు తొలగించకుండా ప్రభుత్వం వారిని కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యల్క సోమయ్య గౌడ్, ఉప్పతల గోవిందు, షేక్ ముస్తఫా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోతనబోయిన హుస్సేన్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దుర్గి బ్రహ్మం, వీరమల్లు, వెంకటనారాయణ, శ్రీను, ఆదినారాయణ, నరసింహారావు, నాగరాజు, గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.