27.7 C
Hyderabad
April 30, 2024 10: 19 AM
Slider ముఖ్యంశాలు

కొత్త సెక్రటేరియేట్ లో మందిరం మసీదు చర్చి

#Telangana CM KCR 1

కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ లో మందిరం, మసీదులు, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్ కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేసి, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు.

కొత్త సెక్రటేరియట్ లో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఇవాళ సమావేశమయ్యారు. పాత సెక్రటేరియట్ భవనాలు కూల్చి వేస్తున్న సందర్భంలో అక్కడున్న మందిరం, రెండు మసీదులకు నష్టం వాటిల్లింది.

వాటిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో అన్ని సౌకర్యాలతో నిర్మించాలని నిర్ణయించారు. పాత సెక్రటేరియట్ లో ఉన్న స్థలంలోనే మసీదుల నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత మసీదులను వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తుంది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మందిరం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది.

నిర్మాణం పూర్తయ్యాక దేవాదాయ శాఖకు మందిరాన్ని అప్పగిస్తుంది. కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో తమకు కూడా ప్రార్థనా మందిరం కావాలన్న క్రిస్టియన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వం నిర్మిస్తుంది. ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చి, విద్య నేర్పించే అనీస్ – ఉల్ – గుర్భా నిర్మాణం వేగవంతం చేస్తామని సిఎం చెప్పారు.

ఇప్పటికే 80 శాతం నిర్మాణం పూర్తయింది. మరో 18 కోట్లు అవసరమవుతాయి. వాటిని వెంటనే విడుదల చేసి, నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని ఆయన అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ఇస్లామిక్ సెంటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికోసం స్థలం కూడా కేటాయించింది. కరోనా పరిస్థితుల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది. వెంటనే ఈ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఖబ్రస్థాన్ లు రావాల్సిన అవసరం ఉన్నది. స్థలాలు సేకరించాలని ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను కోరామని సిఎం తెలిపారు.

నగరంలోని వివిధ చోట్ల మొత్తం 150 నుంచి 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్ లు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తిస్తున్నామని ఆయన తెలిపారు.

ఉర్దూ భాష పరిరక్షణకు చర్యలు

ఉర్ధూ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడతామని, అందుకోసం అధికార భాష సంఘంలో ఉర్దూ భాషాభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్ మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ సాహబ్ పాల్గొన్నారు.

ఇంకా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సెక్రటరీ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్, మజ్లిస్ ఉలేమా ఇ డెక్కన్ ప్రెసిడెంట్ మౌలానా సయ్యద్ కుబూల్ బాద్ షా షట్టారి, మౌతమీమ్ దారుల్ ఉలూమ్ రహ్మానియా, ప్రెసిడెంట్ జామియత్ ఉలేమా ఇ హింద్ మౌలానా ముఫ్తీ ఘ్యాసుద్దీన్ రహ్మానీ హాజరయ్యారు.

వీరే కాకుండా, అమీర్ ఈ జామియా నిజాయా మౌలానా సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్ హుస్సేనీ, అమీర్ ఇ జమాత్ ఈ ఇస్లామియా మౌలానా హమీద్ మొహమ్మీద్ ఖాన్ సాహబ్, తామీర్ ఇ మిల్లత్ వైస్ ప్రెసిడెంట్ మౌలానా జియాఉద్దీన్ నాయ్యర్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్, హైదరాబాద్ నాజిమ్ దారుల్ ఉలూమ్ మౌలానా రహీముద్దీన్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

దిశ యాప్ వినియోగం కోసం రంగంలో దిగిన ఎస్.హెచ్.ఓలు

Satyam NEWS

Summer Alert: రెంటచింతలలో నిప్పుల వర్షం

Satyam NEWS

కామారెడ్డిలో ఓయూ జెఎసి చైర్మన్ సత్యనారాయణ భిక్షాటన

Satyam NEWS

Leave a Comment