ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని(నవంబరు1) పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేయనున్న వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించారు. నేడు సతీసమేతంగా రాజ్ భవన్ కి విచ్చేసి ఆయన గవర్నర్ దంపతులను ఆహ్వానించారు.
రాష్ట్రంలో తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సామాన్యులలో అసామాన్యులను వెలికితీసి, విజయవాడలో నిర్వహించనున్న ఈ అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేయాలని గవర్నర్ ను మర్యాదపూర్యకంగా కలిసి కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనపర్చిన వ్యక్తులు, సంస్థలకు మొత్తం 59 అవార్డులను ప్రకటించింది. ఇందులో 29 వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు కాగా 30 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు. కేటగిరీల వారీగా 8 సంస్థలకు,11 వ్యవసాయ అనుబంధ రంగాల్లో, 20 కళలు, సంస్కృతి రంగాల్లో, 7 సాహిత్యంలో, 6 జర్నలిజంలో, 7 గురిని మెడికల్ అండ్ హెల్త్ కు ఎంపిక చేయటం జరిగింది. వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ (జ్ఞాపిక), మెడల్, శాలువ మరియు వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ. 5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ (జ్ఞాపిక), మెడల్, శాలువ బహుకరిస్తారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు ఈ అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్తో పాటు అసామాన్య ప్రతిభ కనపరచిన సామాన్యులను అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘరామ్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి సిసోడియా ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ లు పాల్గొన్నారు.