2022-23 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏరోజుకారోజు దిగుమతి చేసుకోవాలని మిల్లర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు.
ఐడిఓసి సమావేశ మందిరంలో మిల్లుల బాధ్యులు, పౌరసరఫరాల, సహాకార, ఐ.కె.పి, మార్కెటింగ్ శాఖ అధికారులతో ధాన్య కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేపట్టి, ఇప్పటి వరకు 222 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో 127 కొనుగోలు కేంద్రాల ద్వారా 3860 మంది రైతుల నుండి 36442.040 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిదని, 213 మంది రైతులకు రూ. 3,38,54,832 లు వారి ఖాతాలకు నేరుగా చెల్లింపులు చేయడం జరిగిందన్నారు. కోనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత రైస్ మిల్లర్లు దిగుమతి చేసుకోవాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు.
తరగు పేరిట రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన తెలిపారు. ధాన్యం దిగుమతికి కేటాయించిన వాహనాలను నిరంతరం అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు ద్వారా కమీషన్ లబ్ధిపొందుతున్నందున కేంద్రాల భాధ్యులు కేంద్రాల్లో టార్ఫాలిన్లు, నీడకు షామియానా, గన్నీబ్యాగులు తదితర మౌళిక సదుపాయాల కల్పన చేయాలన్నారు.
మిల్లర్లు కొనుగోలు కేంద్రాల బాద్యులు రైతులకు తొడ్పడుతున్నాం అనే భావన కాకుండా వారి నుండే ఆదాయం పొందుతున్నందున భాద్యతగా వ్యవహరించి రైతులకు సహకరించాలన్నారు. ఎఫ్సిఐ ద్వారా అదనపు గోదాములు, స్టేట్ వేరింగ్హౌస్ గోదాముల లీజుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు.
రైతులు ఎఫ్.ఏ.క్యూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తాల్ లేకుండా చూడాలని, తేమశాతం ఆమోదానికి మించి ఉండకుండా చూడాలని, నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేవాలని కలెక్టర్ అన్నారు.