హైదరాబాద్ చాదర్ ఘాట్ లో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేసిన మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే అనుచరుడైన షకీల్ పై వెంటనే కేసు పెట్టి అరెస్టు చేయాలని బిజెపి దళిత మోర్చ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు నల్ల రాజా రామ్ డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు పత్రికా విలేకరుల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి నల్ల రాజరాం తో బాటు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, కౌన్సిలర్లు కొంతం మురళి, సాయి కుమార్ పాల్గొన్నారు. మజ్లీస్ నాయకుడు చేసిన ఈ అత్యాచారంపై దళిత సంఘాలు, దళిత సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని రాజారామ్ ప్రశ్నించారు.
దళిత నాయకులు టీఆర్ఎస్ పార్టీకి, లేదా ఒక మతం వారికి భయపడి ఇలాంటి సమస్యను నిర్లక్ష్యం చేస్తే రాబోయే కాలంలో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు.
మున్సిపల్ కౌన్సిలర్ కొంతం మురళి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేయడం నుంచి ఓ దళిత బాలికపై అత్యాచారం జరిగినా స్పందించడం లేదని అన్నారు.
బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ పాతబస్తీలోని హిందువులు అభద్రతాభావంతో జీవిస్తున్నారనడానికి చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికపై జరిగిన అత్యాచారమే నిదర్శనమని అన్నారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి మరణ శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.