గ్రూప్-1 పరీక్షల రద్దు నేపద్యంలో అభ్యర్థులు అధైర్యపడకుండా ఉండాలని వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల ధనదాహం కారణంగా నిరుద్యోగ యువత గోస పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 2022లో ఇచ్చిన 91వేల ఉద్యోగాల భర్తీ హామీ సంవత్సరం దాటినా అమలుకాలేదని విమర్శించారు. ఎట్టకేలకు గ్రూప్-1 పరీక్షలు పెట్టగా సుమారు 3లక్షల 80వేల మంది అభ్యర్థులు హాజరైతే బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అవి రద్దు కావడం జరిగిందన్నారు.
లక్షలు వెచ్చించి కోచింగ్ లు తీసుకుని పరీక్షలు రాసిన అభ్యర్థుల జీవితాలు రోడ్డున పడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. యువతీ, యువకులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని మీ అందరి దీవెనలతో అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలను ఏడాది కాలంలోనే భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు.