బంగారు తెలంగాణ సాధనకు బాసటగా నిలిచేందుకు, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభివృద్ధి పాలనకు ఆకర్షితులై లక్ష్మణచాంద మండలం తిర్పెల్లి గ్రామానికి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు బీజేపీని వీడి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. యువకులు, ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా నిర్మల్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుల్లా పని చేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నిర్మల్ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంతో నిర్మల్ రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గులాబీ శ్రేణులంతా కులం పేరుతో, మతం పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మరాదని సూచించారు.
బీఆర్ఎస్లో చేరిన పలువురు యువకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్, నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేస్తున్న కృషిని స్వయంగా చూసి బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తిర్పెల్లి గ్రామం నుంచి అత్యధిక ఓట్లు బీఆర్ఎస్కే పడేలా చూస్తామన్నారు.