ముఠా తగాదాలతో కూనారిల్లుతున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాన్ని చక్కదిద్దేందుకు వైకాపా అధిష్టానవర్గం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. హిందూపురం నియోజకవర్గానికి వైకాపా ఇంఛార్జ్ గా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఉన్నారు. చాలా కాలంగా ఆయన వ్యతిరేక వర్గమైన నవీన్ నిశ్చల్, అబ్దుల్ గనీ మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.
నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ విభేదాలు కొంతకాలంగా బహిరంగంగానే బయటపడుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న వైకాపా అధిష్టానం అసంతృప్త నేతలతో చర్చించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించింది. హిందూపురం వైకాపాలోని అసంతృప్త నేతలతో మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు.
అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనే ఇరువర్గాల నేతలు పరస్పరం వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఇక్బాల్ వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నట్లు నవీన్, అబ్దుల్ పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశారు. స్థానికేతరుడైన ఇక్బాల్కు హిందూపురం టికెట్ ఇవ్వొద్దని వారు కోరారు. ఇక్బాల్ తమపై పెత్తనం చెలాయిస్తున్నారని, దీన్ని సహించేది లేదని వారు స్పష్టం చేశారు.
ఇక్బాల్ కాకుండా ఎవరిని ఇంఛార్జ్గా ఉంచినా పర్వాలేదని, ఇక్బాల్కు ఇస్తే తాము పనిచేసేది లేదని నవీన్ నిశ్చల్, అబ్దుల్ గనీ సహా ఇతర నేతలు తేల్చి చెప్పారు. సీఎం జగన్ ఆదేశిస్తే నియోజక వర్గాన్ని వదలి వెళ్లేందుకు సిద్దమని ఈ సందర్భంగా మహ్మద్ ఇక్బాల్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వివాదం సద్దుమణగకపోవటంతో సీఎం జగన్ వద్ద పంచాయితీ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.