జిల్లాలో ఉపాధి, వ్యాపార రంగాలను మరింత అభివృద్ధి చేసేందుకు సంక్షేమ శాఖలతో పాటు ఐ.టి. వి.హబ్ తో కలిసి పనిచేద్దామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో అదనపు కలెక్టర్ మను చౌదరి, వివిధ సంక్షేమ శాఖల అధికారులు , ఐ.టి. వి.హబ్ ప్రతినిధులతో పాటు వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా అటవీ శాఖ ఎఫ్.డి.ఓ రోహిత్ రెడ్డి, నవీన్ రెడ్డి లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న ఔత్సాహికులు, ఇప్పటికే చిన్నగా వ్యాపారం చేస్తున్న వారికి ఐ.టి. వి.హబ్ సభ్యుల సహకారంతో వారికి డి.పి.ఆర్ తయారు చేసి ఇవ్వడం, క్రెడిట్ లింకేజీ, జి.ఎస్టీ రిజిస్ట్రేషన్, ఫైనాన్షియల్ లీట్రసి, బయట మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే అంశాల పై సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు.
ఇప్పటికే జిల్లాలోని చారకొండ మండలానికి దళితబంధు మంజూరు అయి దాదాపు 500 మంది వరకు లబ్ధిదారులు ఉన్నారని వారిలో ఎవరెవరు ఏ ఏ రంగంలో వ్యాపారం మొదలు పేటెందుకు సిద్ధంగా ఉన్నారో అలాంటి వారికి వి.హబ్ సహకారంతో పూర్తి సహకారం అందజేసే విధంగా సంక్షేమ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఔత్సాహికులను గుర్తించి వారికి అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. జిల్లాలో మామిడి, సీతాఫలం వంటి పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లు, జ్యుట్ బ్యాగ్ ల తయారీ వంటి చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలు కొనుక్కొని కిరాయికి నడపటం, కిరాణ షాపు వంటివి మాత్రమే పెట్టేందుకు ముందుకు వస్తారని కానీ అవి అవసరానికి మించి ఉండటం వల్ల చాలా నష్టపోతారని తెలిపారు.
వ్యాపారాలు చేసేందుకు ముందుకు వచ్చే మహిళా సంఘాల సభ్యులు కావచ్చు ఇతరులు కావచ్చు వ్యాపారం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నవారిని గుర్తించి వారి నుండి దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔత్సాహికులకు కేంద్ర ప్రభుత్వ పతకాలు ఆయిన స్టాండప్ ఇండియా, ముద్ర రుణాలు, టి ప్రయిడ్ ద్వారా రుణాలు అందించేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, పి.డి.డి.ఆర్.డీఏ నర్సింగ్ రావు, పి.ఓ. ఐ.టి.డి.ఏ అశోక్, ఎస్సి కార్పొరేషన్ ఈ.డి. రాంలాల్, మెప్మా మేనేజర్ రాజేష్, వి.హబ్ నుండి దీప్తి వారి టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పోలా శ్రీధర్, సత్యంన్యూస్.నెట్, కల్వకుర్తి