మోడీ, అమిత్ షా ఇద్దరు గుజారాతీలు అని అందుకే దేశ ప్రజల సొమ్మును దోచుకుంటూ ఇద్దరు గుజరాతిలైన ఆదాని, అంబానీలకు అంటగడుతున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. మాచారెడ్డి మండలంలో తడకపల్లి, అక్కాపూర్, కొత్తపల్లి, లక్ష్మీరావులపల్లి, చుక్కాపూర్ గ్రామాల్లో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మాజీ మంత్రి మాజీ షబ్బీర్ పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా గానీ ప్రాంతీయ పార్టీ గాని మాట్లాడితే ఈడి, ఐటీ దాడులతో బెదిరిస్తున్నారన్నారు. భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇంటర్నేషనల్ మీడియా అయిన బీబీసీపై ఐటి దాడులు సిగ్గుచేటని, ఈ దాడులతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ క్యాతి దిగజారే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారి ప్రభుత్వాలు కూల్చి వాళ్ళ గుర్తులు పార్టీలు రద్దు చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ హయాంలో ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయలకే వంట గ్యాస్ అందిస్తామన్నారు. ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని, స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు అందిస్తామని, 2లక్షల రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు విద్యుత్ బిల్లు కట్టడానికి డబ్బులు లేవంటే ఏసీడీ చార్జీలు వసూలు చేస్తున్నారని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.
అభయ హస్తం, స్త్రీ నిధి, వడ్డీ లేని రుణాల విడుదల కోసం పోరాటం చేస్తామన్నారు. గత నాలుగేళ్లుగా మహిళా సంఘాలకు రావలసిన వడ్డీ లేని రుణాల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఇవ్వడం లేదని తెలిపారు. అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుపై వేల కోట్ల దోపిడి చేశారని ఆరోపించారు. ప్రాజెక్టుల కోసం గుంజుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల భూములకు పరిహారం ఇవ్వలేదన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల కష్టాలు తీరుస్తామని పేర్కొన్నారు.