ఇద్దరు ములుగు మండల ఉపాధ్యాయులకు గురుస్పందన పురస్కార్ -2023 అవార్డులు దక్కాయి. స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్- ఖమ్మం వారి ఆధ్వర్యంలో గురుస్పందన పురస్కార్ 2023 అవార్డుల బహుకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 140 మంది ఉపాధ్యాయులను గురుస్పందన పురస్కార్ -2023 అవార్డులచే ఘనంగా సత్కరించడం జరిగింది.
ములుగు జిల్లా నుండి తెలుగు పండితులు సముద్రాల నరసింహాచార్యులు( జెడ్ పి హెచ్ ఎస్ పత్తిపల్లి ములుగు మండలం ) ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కొత్తపల్లి పోషన్న ( ఎంపీపీ ఎస్ బరిగలపల్లి ములుగు మండలం )ల ను ఈ పురస్కారాలతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ పాల్గొని మాట్లాడుతూ భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను,ప్రతి సంవత్సరం ఈ విధంగా సన్మానించి సత్కరించడం చాలా గొప్ప విషయమని అన్నారు.
అదేవిధంగా ఈ ఫౌండేషన్ నిర్వాహకులు సామ్యూల్ రెడ్డి మాట్లాడుతూ, చక్కటి విలువలతో కూడిన, విజ్ఞానవంతులైన, ఉత్తములైన విద్యార్థులను తయారు చేసే ఏకైక కేంద్రము అది పాఠశాల మాత్రమే అన్నారు. అలాంటి పాఠశాల కేంద్రంగానే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రక్షక భటులు శాస్త్రవేత్తలు, గ్రామం, మండలం, రాష్ట్రం, దేశం ప్రపంచ స్థాయి వరకు ఏల గలిగే ఉత్తమ పరిపాలకులను అందించే ఏకైక కేంద్రం- అది విద్యా కేంద్రము మాత్రమే అన్నారు.
ఇలాంటి ఉత్తములను తయారు చేసే ఏకైక ఆయుధము,సాధనము అదిఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే అని అన్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ మమ్ములను గురుస్పందన పురస్కార అవార్డులతో సత్కరించినందులకు, స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఉపాధ్యాయులలో మంచి ఉపాధ్యాయులు చెడు ఉపాధ్యాయులు అనే వారు ఎవరు ఉండరని, అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే ఉంటారని, ప్రతి జిల్లా నుండి ప్రతి సంవత్సరం ఈ విధంగా కొంతమంది ఉపాధ్యాయులను సన్మానించి ఉత్తేజపరచడం, మరింత బాధ్యతను గుర్తు చేయడం చాలా బాగుందని వారు కొనియాడుతూ, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లాలోని ములుగు మండలంలో గల ఇద్దరు ఉపాధ్యాయులను సన్మానించినందుకు స్థానిక మండల విద్యాశాఖ అధికారి సామల శ్రీనివాసులు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.