ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కోరారు.
సోమవారం వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాడిపత్రి, వనపర్తి మునిసిపల్ పరిధిలోని నర్సింగయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. వివిధ రకాల మొక్కలను పరిశీలించి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మొక్కలు నాటితే ఎండి పోవడానికి వీలు లేకుండా ఉంటుందని తెలిపారు.
నాటిన మొక్కల కు ట్రీ గార్డులు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు జులై 1 నుండి ప్రారంభమయ్యే ఏడవ విడత హరితహారంలో మొక్కలు సిద్ధంగా ఉంచాలని నర్సరీ నిర్వాహకులను ఆదేశించారు.
హరిత హారంలో జిల్లా వ్యాప్తంగా 27 లక్షల మొక్కలు నాటేందుకు గ్రామాలలో ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా కృషి చేసి మొక్కలు నాటాలన్నారు. జూలై 1 నుండి జరిగే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో గ్రామాలలో శానిటేషన్ మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు ఉంటాయని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా నర్సరీలో వివిధ రకాల మొక్కలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి