అరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు తగ్గట్టుగా వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.కోటి వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్) స్కానింగ్ పరికరాన్ని మంత్రి పువ్వాడ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా వేలాది మంది చిన్నారులు ఏదో ఒక లోపంతో పుడుతున్నారని, ఈ సమస్యను అధిగమించి, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసిందన్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ రూపొందించిన టిఫా స్కానింగ్ పరికరం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది, ముఖ్యంగా తల్లి బిడ్డా సంరక్షణకు సర్కారు పెద్ద పీట వేసిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రు.20 కోట్లతో మొత్తం 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్లు లాంఛనంగా ప్రారంభించామన్నారు. నెలకు 20 వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులుబాటు ఉందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకావాలని కోరారు. ప్రైవేటులో 2 నుండి 3 వేలు అయ్యే స్కానింగ్ ఇక మీదట ఉచితంగా సర్కారు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ప్రతి సామాన్యులకు చేరువైందని అన్నారు. అవసరమైన వారికి టిఫా స్కానింగ్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ టెస్ట్ ద్వారా బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే గుర్తించేందుకు, తద్వారా తగు వైద్యం అందించేందుకు వీలుంటుందన్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజాగా ఆదేశాల ప్రకారం ఈ సౌకర్యం ఎర్పాటు చేయడం జరిగిందన్నారు.