రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, గోదావరి నది పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ములుగు, భూపాలపల్లి జిల్లా పోలీస్ అధికారులను ఉద్దేశించి ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సంసిద్ధంగా ఉండాలి అని ఆదేశించారు. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో సమాచార మార్పిడి చేసుకుని సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న చెరువులు,వాగులు, గోదావరి నది ప్రవాహా తీవ్రతను గమనిస్తూ అత్యవసర సేవలకు సంసిద్ధంగా ఉండాలన్నారు.
చెరువులు వాగుల వద్ద లోతు తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. జాతీయ రహదారి పై వెళ్లే వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.
రహదారులపై నీటి ప్రవాహాలు వెళ్తున్నప్పుడు వాటిని దాటే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రవాహం అధికంగా ఉంటే ప్రవాహాలను దాటడానికి ప్రయత్నం చేయకూడదని సూచించారు. వ్యవసాయ పనికి వెళ్లే రైతులు విద్యుత్ మోటార్లు,కరెంటు స్తంభాల వద్దకు వెళ్లకూడదని సూచించారు.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఎవరు ఉండకుండా సామాన్య పరిస్థితులు ఏర్పడే వరకు సురక్షిత ప్రదేశాలలో ఉండాలన్నారు.ఎటువంటి ఆపద సమయంలోనైనా డయల్ 100,జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 7901628410 కు సమాచారం ఇచ్చి పోలీసు వారి సహాయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ములుగు ఏ ఎస్ పి పోతరాజు సాయి చైతన్య, ఏటూరునాగారం ఏ ఎస్ పి గౌష్ ఆలం, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు.