స్వర్ణ హాస్పిటల్ ప్రమాదంపై ట్విట్లు పెట్టి వివాదంలో తలదూర్చిన హీరో రామ్ పోతినేని చివరకు తోకముడిచాడు. ఇక నుంచి ఈ అంశంపై తాను ఎటువంటి ట్వీట్లు చేయనని తేల్చి చెప్పాడు. ఈ వివాదానికి సంబంధించి కేసులో ఇరుక్కున్న తన బాబాయి డాక్టర్ రమేష్ కు అనుకూలంగా హీరో రామ్ ట్విట్ చేసిన విషయం తెలిసిందే.
సీఎం జగన్ వెనక భారీ కుట్ర జరుగుతున్నదని, ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ఇదంతా చేస్తున్నారంటూ.. రామ్ చేసిన ట్వీట్లు సంచలనమైంది. రాజకీయంగానూ ఇది చర్చనీయాంశమైంది. మరోవైపు విజయవాడ పోలీసులు కూడా దీనిపై స్పందించి అగ్ని ప్రమాద ఘటనపై తమకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్కు కూడా నోటీసులు పంపుతామని తెలిపారు.
ఈ క్రమంలోనే రామ్ తాజా ట్వీట్ చేశాడు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఇంకోసారి తాను ట్వీట్ చేయనని రామ్ ప్రకటించారు. న్యాయంపై తనకు నమ్మకముందని, ఎవరైనా, ఎవరికి చెందిన వారైనా నిజమైన దోషులకు శిక్ష పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.