ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన కరీంనగర్, వరంగల్ తో బాటు ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయని తెగిపోయిన చెరువులు, మునిగిపోయిన పంటపొలాలు, కూలిపోయిన ఇళ్ళ విషయంలో ఇప్పటికే కలెక్టర్ ల ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయ ,రెవెన్యూ అధికారులు పర్యటించి నష్ట అంచనాలు వేస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
నేడు ఆయన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్, కమలాపూర్ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ వర్షాలతో వాగులు వంకలు పొంగడమే కాకుండా చెరువులు నిండి పోయాయి. చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి.
ఇంత పెద్ద ఎత్తున, ఇంత తక్కువ కాలంలో వర్షం పడటం అరుదుగా జరుగుతుంది. జరిగిన సంఘటన అన్నింటిని పరిశీలించి వరద తగ్గిన తర్వాత సహాయ చర్యలు సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు వెంటనే ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ ఆహారాన్ని కావలసిన సహకారాలు అందిస్తామని కూడా మంత్రి వెల్లడించారు.
ఉప్పల్ చెరువు, కోతకు గురి అయిన రోడ్లు, ముంపు ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. అక్కడి బాధితులను పరామర్శించారు. వంగపల్లి, షంబునిపల్లిలో ఆయన పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. సిఎస్ ఆధ్వర్యంలో కంట్రోల్ సెంటర్ నడుస్తుంది.
అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి ప్రత్యేక బృందాలు పంపిస్తున్నారు. అవసరం ఉన్నచోట ప్రజలను షెల్టర్ లకు తరలించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాబోవు 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్షాలు ఉంటాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.