విజయనగరం ఉత్సవాల నేపథ్యంలో స్థానిక మహారాజ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన, కోట ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన చిత్రలేఖనం, వైజ్ఞానిక ప్రదర్శనలు, ఆర్ట్ & క్రాఫ్ట్స ఎగ్జిబిషన్లు అబ్బురపరుస్తున్నాయి. వివిధ రకాల ఫలాలు, కూరగాయలు, పుష్పాలు, పురాతన వస్తువులు, నాణేలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మహారాజ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలను, విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కోట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిత్రలేఖనం, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, పురాతన వస్తు, స్టాంప్లు, నాణేల ప్రదర్శనలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు రఘురాజు, సూర్యనారాయణ రాజు, కలెక్టర్ ఎ. సూర్యకుమారి, ఎస్పీ దీపికా ఎం. పాటిల్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇతర ప్రజాప్రతినిధులు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆ సందర్భంగా వారంతా ఆసక్తిగా తిలకించి బాగున్నాయని కితాబిచ్చారు.
ప్రత్యేకంగా నిలిచిన వివిధ ప్రాజెక్టులు
స్థానిక కోట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనల్లో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు పలు రకాల ప్రాజెక్టులను రూపొందించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భవిష్యత్తుకాలంలో తీర్చాల్సిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం 85 రకాల ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ఒక్కో ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను విద్యార్థులు సందర్శకులకు వివరించారు. ఇదిలా ఉండగా సంబంధిత సైన్స్ ఫెయిర్ ను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి కుశల ప్రశ్నలు వేశారు.
ప్రదర్శనలో విశేషాలు, విశిష్టతలు
మహారాజ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో బోన్సాయ్, కిచెన్ గార్డెన్, టెర్రాస్ గార్డెన్, నక్షత్ర వనం, మైక్రో గ్రీన్స్, వివిధ రకాల కూరగాయలు, కొబ్బరి జాతులను ఉంచారు. వివిధ పండ్ల ఉత్పత్తుల గురించి, హైబ్రీడ్ జాతుల గురించి అవగాహన కల్పిస్తూ నమూనా స్టాళ్లను ప్రదర్శనలో ఉంచాయి. కూరగాయలు తరిమినప్పుడు వచ్చే వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ విధానం గురించి అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు.
అలాగే స్థానిక కోట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో జాతిపిత మహాత్మ గాంధీ చిత్రపటం, బొమ్మలతో కూడిన సుమారు 30 వేల రకాల నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపులను అందుబాటులో ఉంచాయి. వీటి విశిష్టతల గురించి సెంట్రల్ బ్యాంకు మాజీ ఉద్యోగి జి.ఎస్. శివ ప్రసాద్ సందర్శకులకు క్లుప్తంగా వివరించారు. చారిత్రక అంశాలను, చరిత్ర కారులు ఉపయోగించిన పురాతన కాలం నాటి వివిధ రకాల రాతికి సంబంధించిన వస్తువులను, నాణేలను ప్రదర్శనలో ఉంచగా కందుల వెంకటేష్ వివరించారు.