మత్స్యకార భరోసా పథకంలో భాగంగా విజయనగరం జిల్లాలో 2953 కుటుంబాలకు 2.953 కోట్ల ఆర్థిక సాయం వారి ఖాతాల్లో జమ అయ్యింది. వేట నిషేధకాలంలో మత్స్యకారుల సంక్షేమార్థం ప్రవేశపెట్టిన ఈ పథకం మూడో విడత సాయాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి మీట నొక్కడం ద్వారా విడుదల చేశారు. వరుసగా మూడో ఏడాది అనగా 2021-22 కాలానికి గాను ఒక్కో కుటుంబానికి 10 వేలు చొప్పున రైతుల ఖాతాలకు జమ చేశారు.
రాష్ట్రంలో మత్స్యకార సోదరుల సంక్షేమార్థం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంత్రులు, లబ్ధిదారుల సమక్షంలో సీఎం ప్రారంభించారు. రాష్ట్రం నుంచి పలువురు లబ్ధిదారులు మాట్లాడిన తర్వాత సంబంధిత చెక్కును సీఎం చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం జిల్లాకు సంబంధించిన చెక్కును ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్, జేసీ లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీ కిషో ర్ కుమార్, మత్స్యశాఖ ఉప సంచాలకులు నిర్మలాకుమారి, జిల్లా మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ బర్రె చినప్పన్న, మత్స్యకార నాయకులు మైలపల్లి నర్శింహులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో పని చేస్తున్నారు
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడారు. మత్స్యకార సోదరుల సంక్షేమం కోసం సీఎం జగన్ దృఢ సంకల్పంతో పని చేస్తున్నారని కొనియాడారు. మత్స్యకార భరోసా పథకం వల్ల జిల్లాలో 2953 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు.
వేట నిషేధ కాలంలో గత ప్రభుత్వాలు అందించిన సాయంతో పోలిస్తే ఇప్పుడు అందిస్తున్న 10వేలు చాలా ఎక్కువని ఉద్ఘాటించారు. మత్స్యకారులకు నాడు సీఎం వైఎస్సార్ ఇప్పుడు సీఎం జగన్ ఎన్నో మంచి పనులు చేశారని గుర్తు చేశారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలోని మత్స్యకారులకు ఈ ఆర్థిక తోడ్పాడు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. పూసపాటిరేగ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. మత్స్యకారుల జీవనోపాధి పెంపుదలకు ఈ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని పేర్కొన్నారు. వేట నిమిత్తం దారి తప్పిపోయిన మత్స్యకారులను బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి విడిపించి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.
అలాగే జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కట్టడికి అధికారులు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే అన్నారు. విభిన్న పద్ధతులు ఆచరిస్తూ కోవిడ్ సేవలందిస్తున్నారని కితాబిచ్చారు. మరిన్నిసేవలందించి ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు.