హైదరాబాద్ నగరం క్రికెట్ బెట్టింగ్ లకు నిలయంగా మారిపోయింది. ఇప్పటికే పలువురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసిన హైదరాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు నేడు మరో ఇద్దర్ని అరెస్టు చేశారు.
హైదరాబాద్ లోని మంగళ్ హాట్ ప్రాంతంలో నివాసం ఉండే ధరమ్ సింగ్ అనే వ్యక్తి ప్రస్తుతం నడుస్తున్న ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లను నిర్వహిస్తున్నాడు. టివిలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బెట్టింగ్ పెట్టాలి.
బెట్టింగ్ కాయాలంటే ముందుగా ధరమ్ సింగ్ కు డబ్బులు చెల్లించాలి. ధరమ్ సింగ్ భార్య సుమన్ లత ఈ బెట్టింగ్ డెన్ ను నిర్వహిస్తుంటుంది. ఆమెకు టి రాహుల్ సింగ్ సహకరిస్తుంటాడు.
పక్కా సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు డిసిపి పి రాధా కిషన్ రావు ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు టీమ్ సిఐ బి గట్టు మల్లు నేతృత్వంలో ఎస్ ఐలు మహమ్మద్ ముజఫర్ అలి, ఎన్ రంజిత్ కుమార్ లతో కలిసి దాడి చేశారు.
టాస్క్ ఫోర్సు సిబ్బంది మంగళహాట్ లో తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి సెల్ ఫోన్లు, 27 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.