తమ సమస్యలను పరిష్కరించకపోతే కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేస్తామని, లబాణా లంబాడాల నుంచి 1016 నామినేషన్లు వేస్తామని లబాణా లంబాడా రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ హెచ్చరించారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇకపై బుజ్జగింపులు ఉండవని, నేరుగా యుధ్ధానికే సిద్ధమవుతామన్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వాన్ని వేడుకున్నామని ఇకపై తాడోపేడో తేల్చుకుంటామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వేసిన చెల్లప్ప కమిషన్ కు విలువ ఉందా.. ఉంటే కమిషన్ నివేదిక ప్రకారం తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ నాయకునిగా కేసీఆర్ కు తమ సమస్యలు తెలియవా అని ప్రశ్నించారు. తామేమీ కొత్తగా అడగడం లేదని, బిచ్చంగా అడుక్కోవడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.వారం రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే 25 వేల మందితో కామారెడ్డిలో ఏక్తా ర్యాలీ చేపడతామని, కలెక్టర్ ను దిగ్బంధిస్తామని, అప్పటికి స్పందన లేకపోతే సెక్రెటరీయేట్ దిగ్బంధిస్తామని హెచ్చరిక జారీ చేశారు. ప్రాణాలకైనా తెగిస్తామని, హక్కులను సాధించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గాంధారి మండల వైస్ ఎంపీపీ భజన్ లాల్, బంతిలాల్, అమర్ సింగ్ నాయక్, కిషన్, జగదీష్, గాంధారి అధ్యక్షుడు దర్బార్, యూత్ అధ్యక్షుడు నర్సింగ్, గణేష్, ధన్ రాజ్, చందు, పెంటయ్య, బలరాం తదితరులు పాల్గొన్నారు.