రేపటి మేడే జెండా ఆవిష్కరణ, ప్రదర్శనను జయప్రదం చేయాలని హుజూర్ నగర్ పట్టణంలోని పారిశ్రామిక వాడలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
50 మంది హమాలీ కార్మికులతో ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా హమాలీ సంఘం గౌరవ అధ్యక్షుడు ఐఎఫ్టియు జిల్లా నాయకుడు మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో బీహార్ రాష్ట్ర కార్మికులు ఎక్కువ మంది పనిచేస్తున్నారని,నేపాల్, జార్ఖండ్,చత్తీస్గడ్ కార్మికులు కూడా ఉన్నారని,వలస కార్మికులు కనుక వీరిని యదేచ్ఛగా దోపిడీకి,పీడనలకు గురిచేస్తున్నారని అన్నారు.వీరు పని చేసే సమయం అంటూ లేకుండా తెల్లవార్లు, పొద్దస్తమానం ఎప్పుడు పడితే అప్పుడు పని చేయించుకుంటున్నారని, రక్తతర్పణ చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం అపహాస్యం పాలౌవుతుందని అన్నారు.
బీహార్,నేపాల్,జార్ఖండ్ తదితర వలస కూలీలను పశువుల పాకలకన్నా అధ్వాన్నమైన షెడ్లలో కుక్కుతున్నారని, బూడిద,పొట్టు,నూకల పొడితో పోటీపడి దుర్భరమైన జీవితం గడుపుతున్నారని,వీరి దుర్భరమైన జీవితాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వలస కూలీలకు కేంద్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని,ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.మానవతా విలువలు పడిపోతున్నాయని,కొద్దిమంది బీహార్ ఏజెంట్లు,బ్రోకర్లు కార్మికులను బానిసలుగా చేసి పని చేయించుకుంటున్నారని,ఈ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
136వ,మేడే జెండాను వాడవాడలా ఎగరవేసి పోరాట వారసత్వం ఇచ్చిన అమరులైన కార్మికులకు జోహార్లు అర్పించాలని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ నాయకుడు అజయ్,ఐ ఎఫ్ టి యు పట్టణ కార్యదర్శి యాకూబ్,హమాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు గురవయ్య,కార్యదర్శి మన్యం పెద్ద నాగేశ్వరరావు,వీరయ్య, సైదా,రాజు,ముఖేష్,రమేష్,చిన్న నాగేశ్వరరావు,ప్రభువు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్