ఆపరేషన్ పరివర్తన 2.0 లో భాగంగా ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని గిరిశిఖర గ్రామమైన తమ్మన్నమెరక శివార్లలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆధ్వర్యంలో ఎస్ఈబి మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 800 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ. – ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నాటుసారా తయారీ మరియు రవాణా చేస్తున్నవారిపై 991 కేసులు నమోదు చేసి 268 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రవాణకు వినియోగించిన 47 వాహనాలను, 24,940 లీటర్లు నాటుసారాను స్వాధీనం చేసుకొన్నామన్నారు.
అదే విధంగా నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 3,35,350 లీటర్లు బెల్లం ఊటలను ఇప్పటి వరకు ధ్వంసం చేశామన్నారు. నాటుసారా కేసుల్లో 2 సార్లు కంటే ఎక్కువసార్లు పట్టుబడుతున్న నిందితులను బైండోవర్చే సి, వారిపై పిడి ఏక్ట్ అమలు చేస్తామన్నారు.
జిల్లా వ్యాప్తంగా నాటుసారా నియంత్రణకు నిరంతరం దాడులు చేపడుతున్నామని, నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణపై సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ దీపిక స్పష్టం చేసారు.
ఈ దాడులలో విజయనగరం సబ్ డివిజన్ ఇన్చార్జ్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, కొత్తవలస సిఐ బాల సూర్యారావు, కొత్తవలస ఎస్ఈబి ఇన్స్పెక్టర్ రాజేశ్వరి, స్థానిక పోలీసులు, ఎస్ఈబి సిబ్బంది పాల్గొన్నారు.