కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కార్పోరేట్లకు, పెట్టుబడిదారులకి ఎర్ర తివాచీ పరిచి దోచి పెట్టిందని,కార్మిక వర్గాన్ని,పేద ప్రజలని, రైతులని,నిరుద్యోగులను అన్యాయం చేసిందని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి విమర్శించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కార్మికుల సమావేశంలో శీతల రోషపతి పాల్గొని మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను, స్కీం వర్కర్స్ ని,నిరుద్యోగులను విస్మరించిందని,ఉపాధి హామీ పథకాన్ని గతంలో బడ్జెట్ లో 90 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు 60 వేల కోట్లు కేటాయించటం అన్యాయమని అన్నారు.ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయటానికే ప్రధాన కారణమని,దేశంలో 60 శాతం ఆర్థికంగా సాయం చేసే 90 శాతం ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు ఎలాంటి భద్రత కల్పించలేదని ధ్వజమెత్తారు.
బడ్జెట్లో తెలంగాణ ఊసే లేదని అన్నారు.బడ్జెట్ ఆదాయం ఎక్కడెక్కడ నుండి వస్తాయన్న విషయం చెప్పలేదని, ధనికుల( పెట్టుబడిదారుల ) పై పన్నులు పరిధి పెంచే ప్రయత్నం చేయలేదని, ఖర్చుల కోసం మరిన్ని అప్పులు తీసుకురావడం తప్ప ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. మొత్తంగా చూస్తే మానవ అభివృద్ధిలో సాంఘిక అభివృద్ధిలో బడ్జెట్ పూర్తిగా విఫలం అయిందని,ఆకలి,దారిద్ర్యం నిరుద్యోగం వంటి కీలక సమస్యలకి బడ్జెట్ ఎలాంటి పరిష్కారం చూపలేదని తీవ్రంగా ఆరోపించారు.
విద్య,వైద్య రంగాలకు కూడా అదనంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదని ఆరోపించారు.పార్టీలకు అతీతంగా మేధా వర్గం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బడ్జెట్ పై స్పందించాలని శీతల కోరారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యు సి నాయకులు మెరుగు దుర్గారావు,కస్తాల సైదులు, రవి, కుమారి, లక్ష్మి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్