ధర్మవరం నియోజకవర్గం లో రోజురోజుకీ శాంతిభద్రతలకు పెద్ద ఎత్తున భంగం వాటిల్లుతోంది… నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ప్రతిరోజు దొమ్మీలు, దౌర్జన్యాలు, దాడులు, హత్యాయత్నాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ విమర్శించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో వైసిపి గూండాలు రెచ్చిపోతున్నారని ఎమ్మెల్యేకు, అతను పెంచి పోషిస్తున్న గూండాలను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. పోలీసులు సైతం అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నిన్నటి రోజున వైసిపి గూండాల చేతిలో చిన్న రామయ్య అనే వ్యక్తి బలయ్యాడన్నారు.
మృతి చెందిన చిన్న రామయ్య భౌతికకాయాన్ని ప్రభుత్వాసుపత్రిలో ఆయన సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ధర్మవరంలో అరాచక పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని ఆయన ధ్వజమెత్తారు.
బత్తలపల్లి ఎస్. ఐ వైసీపీ కండువా కప్పుకుని విధులు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిరంతరం కొందరు పోలీసులు ఎమ్మెల్యే ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం వారు చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
బత్తలపల్లి సంఘటనకు బాధ్యులైన వారిని, ఆ దాడికి ప్రోత్సహించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన సత్యసాయి జిల్లా ఎస్పీ ని కోరారు. బత్తలపల్లి వైసీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శివకృష్ణను పరామర్శించే వైద్యం ఖర్చులకోసం 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గోనుగుంట్ల సూర్యనారాయణ బాధిత కుటుంబానికి అందజేశారు.