అసమర్థులైన ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనులు చేయలేక కేంద్రాన్ని వేలెత్తి చూపుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అసమర్థులైన ముఖ్యమంత్రులు ప్రతి చిన్నదానికి కేంద్రం వైపు వేలెత్తి చూపడం అలవాటు గా మారిందని, తన రాజకీయ జీవితం లో ఏ ప్రభుత్వం ఇంతగా కేంద్రం వైపు చూసిన సందర్భం లేదని ఆయన అన్నారు.
వీళ్ళ అసమర్థతను కప్పి పుచ్చుకోవడం కోసమే కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్ దేశం మొత్తం కోసం ప్రవేశ పెడతారు తప్ప రాష్ట్రం కోసం కాదని కన్నా అన్నారు. ఎవ్వరికి ఇవ్వనంత మెజారిటీ జగన్ ప్రభుత్వానికి ఇచ్చారు, దానిని రాష్ట్ర అభివృద్ధి కి కోసం వాడుకుంటే మంచిది కానీ ఆయన అలా చేయడం లేదని కన్నా అన్నారు.
భూకుంభకోణాల కోసమే వైజాగ్ ను రాజధానిగా జగన్ ఎంచుకున్నారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 2014 నుంచి మోడీ ప్రభుత్వం దేశ రక్షణ, పారిశ్రామికీకరణ పై దృష్టి సారించిందని, నిర్మలా సీతారమాన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అందుకు అద్దం పడుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో పెద్ద పీట వేశారని ఆయన చెప్పారు. మోడీకి అభినందనలు తెలియజేస్తున్నాం అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.