అమ్మ ఒడి పథకం పేరుతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ వివరాలు యథాతధంగా: నవ్యాంధ్రప్రదేశ్లో వైకాపా పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రజల అవసరాలతో నేరుగా ముడిపడి ఉన్న విభాగాలన్నింటా అవినీతి జాడ్యం వికృతరూపం దాలుస్తోంది.
అవినీతే జీవన విధానంగా మారి నేతలు ప్రజల్ని దోచుకు తింటున్నారు. ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలన్నింటినీ దారి మళ్లీస్తున్నారు. సంక్షోభాల నుండి అవకాశాలు సృష్టించుకొని గత తెలుగుదేశం ప్రభుత్వం ముందుకుపోగా ఈ ప్రభుత్వం సంక్షోభాలు సృష్టించి అభివృద్ధిని నిలిపివేసింది. ”అమ్మఒడి” పథకం పేరుతో రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇంట్లో ఎందరున్నారూ. 15 వేలేనా?
ఎన్నికల సమయంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం. వాటిని తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉన్నా తల్లి ఖాతాలో కేవలం రూ.15వేలు మాత్రమే జమచేస్తామని ప్రకటించి వంచిస్తున్నారు. పైగా రాష్ట్రంలో ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు 83 లక్షల మంది ఉంటే.. కేవలం 42 లక్షల మంది తల్లులకు మాత్రమే పథకం వర్తింపజేయడం ద్వారా 41లక్షల మందిని మోసం చేస్తున్నారు.
అమ్మ ఒడిని కూడా వదలని జె టాక్స్
ఇదేనా మాట తప్పను.. మడమ తిప్పను అంటే.? పైగా అమ్మఒడి పథకానికి కూడా జే ట్యాక్స్ వదలలేదు. ప్రజలను మాటలతో బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చాక వంచించడాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. అమ్మఒడి అనేది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పథకం అయినప్పుడు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సింది పోయి.. రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు బలహీన వర్గాలకు చెందిన నిధుల్ని వాడుకోవడం దుర్మార్గం.
బిసిల నిధులు మళ్లిస్తున్నారు
బీసీ కార్పొరేషన్ నుండి రూ.3,432 కోట్లు, కాపు కార్పొరేషన్ నుండి రూ.568 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్ నుండి రూ.442 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ నుండి రూ.395 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ నుండి రూ.1,271 కోట్లను అమ్మ ఒడి పథకానికి మళ్లించి ఆయా వర్గాల సంక్షేమానికి గండికొట్టడం దుర్మార్గపు చర్య.
బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని… నామినేటెడ్ పదవులు, పనుల్లో రిజర్వేషన్ కల్పిస్తామని, అన్ని ఉప కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు, చట్టసభల్లో రిజర్వేషన్ కోసం తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేశారు. బీసీ సంక్షేమ శాఖ రద్దు చేశారు.
ఆదరణ వంటి గొప్ప పథకాలు నిలిపేశారు
ఆదరణ వంటి గొప్ప పథకాలను తుంగలో తొక్కారు. ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.. ఇప్పుడు మాట మార్చి ద్రోహం చేశారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిరుద్యోగులకు వేలాది కార్లు, ట్రక్కులు అందించి స్వయం ఉపాధికి గతంలో బాటలు వేసిన కార్పొరేషన్ నిధుల్ని అమ్మఒడికి తరలించడం ద్వారా వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఫుడ్ బాస్కెట్ వంటి పథకాలను అమలు చేసి.. రక్త హీనత 18% నుండి 5% తగ్గిస్తే.. ఫుడ్ బాస్కెట్ పథకాన్ని తుంగలో తొక్కారు.
కాపులకు అన్ని విషయాల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. న్యాయం చేయకపోగా ఉన్న రిజర్వేషన్లు ఎత్తేసి కాపు ద్రోహిగా మిగిలారు. మైనార్టీ సబ్ ప్లాన్ను పారదర్శకంగా అమలు చేస్తామని ప్రకటించి ఇప్పుడు సబ్ ప్లాన్ నిధుల్ని ఇతర పథకాలకు మళ్లించడం ముమ్మాటికీ దుర్మార్గం.
స్కాలర్ షిప్ లను పక్కన పెట్టారు
కొత్త పథకం పేరుతో పాత పథకాలకు, సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో కోత విధించడం ఆయా వర్గాలను నమ్మించి గొంతు కోయడమే. అమ్మఒడిని సాకుగా చూపి రూ.1,224 కోట్ల ఫీజ్ రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్లను పక్కన పెట్టారు.
మధ్యాహ్న భోజన పథకంలో కోతలు విధించారు. కాస్మోటిక్ ఛార్జీలు నిలిపివేశారు. ప్రశ్నిస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయించారు. ఇదేనా ప్రభుత్వం పనిచేసే తీరు.? అమ్మఒడి పేరుతో పిల్లలు, వారి తల్లిదండ్రులను మోసం చేయడమే కాకుండా.. బలహీన వర్గాల సంక్షేమ నిధుల్ని మళ్లించడం సిగ్గుమాలినతనం. ఇప్పటికైనా మీ అభివృద్ధి నిరోధక చర్యలు మానుకోవాలి. (అనగాని సత్యప్రసాద్) రేపల్లె శాసనసభ్యులు