కాషాయ జెండానే రాబోయే రోజుల్లో జాతీయ జండాగా మారుతుందని చెప్పిన గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్పపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య వాయిదా తీర్మానం ప్రతిపాదించడం కర్నాటక అసెంబ్లీలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఒక దశలో మంత్రి ఈశ్వరప్ప, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థితికి చేరుకున్నారు.
భవిష్యత్తులో ‘భగవ ధ్వజ్’ (కాషాయ జెండా) జాతీయ జెండాగా మారే అవకాశం ఉందని, ఎర్రకోటపై అదే ఎగురవేయవచ్చని ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఈశ్వరప్పను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, ఇలాంటి ప్రకటన చేయడం ద్వారా ఆయన మంత్రిగా కొనసాగే అర్హత కోల్పోయారని సిద్దరామయ్య అన్నారు.
ఎర్రకోట పై వేరే జెండాను ఎగురవేసినందుకు రైతులపై దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయాన్ని సిద్దరామయ్య గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 (1) ప్రకారం మంత్రి చేసిన ప్రకటన దేశ ద్రోహం కిందికి వస్తుందని ఆయన అన్నారు. భారత శిక్షాస్మృతి ప్రకారం కూడా జాతీయ జెండా లేదా రాజ్యాంగం లేదా జాతీయ గీతాన్ని అగౌరవపరచడం దేశద్రోహం కిందకే వస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు, ఈశ్వరప్ప వైపు నడిచారు, అతను కూడా తన సీటు నుండి లేచాడు మరియు ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా వచ్చారు. ఇరువైపులా కొందరు ఎమ్మెల్యేలు వాగ్వివాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన స్పీకర్ సభను మధ్యాహ్న భోజనానికి వాయిదా వేశారు.