కామారెడ్డి బీఆర్ఎస్ లో వర్గపోరు మరోసారి బయట పడింది. మాచారెడ్డి అధికార పార్టీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డిపై ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు దాడికి పాల్పడిన ఘటన పార్టీలో కలకలం రేపింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాలులో మాచారెడ్డి భూత్ స్థాయి నాయకులతో ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చుక్కాపూర్ గ్రామానికి చెందిన ఎన్నికల కమిటీ విషయం చర్చకు రావడంతో జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో జడ్పీటీసీ రాంరెడ్డిపై ఎంపీపీ నర్సింగ్ రావు దాడి చేయడం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఇదే విషయమై నేడు ఉదయం జడ్పీటీసీ రాంరెడ్డి అనుచరులు ఎమ్మెల్యే ఇంటిముందు ఆందోళనకు దిగారు. తమ నాయకునిపై అకారణంగా దాడికి పాల్పడిన ఎంపీపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. మండలంలో ఎంపీపీ ఆగడాలు రోజురోజుకు శ్రుతి మించిపోతున్నాయని కార్యకర్తలు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. ఇప్పటిదాకా పార్టీకి నష్టం రాకుండా అన్ని భరించుకుంటు వచ్చామని ఇకపై అతన్ని భరించడం తమవల్ల కాదని ఎమ్మెల్యేకు తేల్చి చెప్పారు. తాము సీఎం కేసీఆర్ గెలుపుకోసం నిరంతరం కృషి చేస్తున్నామని, పార్టీ కోసం కష్టపడుతున్నామని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే అధిష్టానంతో మాట్లాడుతున్నానని, తప్పకుండా చర్యలు తీసుకునేలా చూస్తామని, కార్యకర్తలు అధైర్య పడవద్దని కోరారు. దాంతో కార్యకర్తలు శాంతించారు.
సత్యం న్యూస్, కామారెడ్డి