ప్రజా సమస్యలను పట్టించుకోని కారణంగా నే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మట్టి కొట్టుకుని పోయిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు దుయ్యబట్టారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మునిసిపాలిటీ కేంద్రంలో బుధవారం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత మంగళవారం నుండి చేపట్టిన నిరాహార దీక్షా శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో పాలకపక్షానికి ఉప ఎన్నికల్లో ఓడిపోయే అంత దుర్గతి ఎందుకు పట్టిందో విమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని వారికి ఇలాంటి ఓటములు పునరావృతమవు తాయని ఆయన అన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ దివాలా పరిస్థితిలో ఉందని విమర్శించారు. మండలంలోని వెలిమినేడు గ్రామంలో పేదలకు పంపిణీ చేసిన భూమిని అనేక సంవత్సరాలుగా వారు సేద్యము చేసుకుంటుండగా వాటిని ఇండస్ట్రియల్ పార్కు పేరున తిరిగి లాక్కోవాలని చూడడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు.
ఈ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టు పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలను వెంటనే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని రాఘవులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి సీతారాము లు కు సంఘీభావం తెలిపిన అనంతరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉచిత విద్య వైద్యం అందించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని అన్నారు.
ప్రపంచంలోని అనేక సంపద కలిగిన దేశాలు విద్య వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నాయని అని అన్నారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే వారికి ఉచిత విద్య అందించాలని ఆయన అన్నారు.
పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజాసమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమా లే ఏకైక మార్గమని ఆ దిశలో ప్రయాణం చేస్తున్నా కమ్యూనిస్టు పార్టీలను బతికించు కోవలసిన అవసరం ప్రజల మీద ఉందన్నారు. ఇంకా ఈ శిబిరంలో సి ఐ టి యు రాష్ట్ర నాయకులు తుమ్మల వీరారెడ్డి పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఆయిలయ్య, శ్రీనివాసులు శీల రాజయ్య, జిట్టా సరోజ, మల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు.