స్వాతంత్ర సమరంలో త్యాగాలు చేసిన సమర యోధులు అందించిన స్పూర్తితో విద్యార్థులు, యువత బాధ్యత గా మెలగాలి అని మిర్యాలగూడ రెవెన్యూ డివిజనల్ అధికారి బి.రోహిత్ సింగ్ పిలుపు నిచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని ఫీల్డ్ ఔట్రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ వెంకట రమణ అధ్యక్షత వహించిన ఈ సదస్సు లో ఆర్డీవో మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట చరిత్రను విద్యార్థులంతా అధ్యయనం చేయాలని సూచించారు. ఇప్పటి తరం పొందుతున్న స్వేచ్ఛ, వనరులు ఉపయోగించుకొని జీవితం లో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర రావు మాట్లాడుతూ విద్యార్థులు తమ గ్రామం, పరిసరాల స్వాతంత్ర పోరాట గాథలు తెలుసుకొని వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.
మిర్యాలగూడ పురపాలక సంఘం కమీషనర్ రవీందర్ సాగర్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాట ఫలితాలు నేటి అభివృద్ధికి బాటలు వేసాయని పేర్కొన్నారు. విద్యార్థులు స్వచ్ఛ భారత్ లో పాల్గొనాలని కోరారు. స్వచ్ఛ మిర్యాలగూడ సాధనలో విద్యార్దులు కూడా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖ తరపున హాజరైన హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ రెడ్డి కోవిడ్-19 టీకాపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్ధులకు ఆజాది కా అమృత్ మహోత్సవ్ పై వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, సర్టిఫికేట్ లు అందచేశారు. కార్యక్రమంలో ప్రదర్శించిన కళా రూపాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమం లో ఎన్ ఎస్ ఎస్ అధికారులు కోటయ్య, ఫ్రాన్సిస్, కళాశాల బోధన సిబ్బంది, ఎన్ ఎస్ ఎస్, ఎన్ సీసీ వాలంటీర్లు పాల్గొన్నారు.