కామారెడ్డి జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే సిఐ జగదీష్ అరెస్టై రిమాండుకు వెళ్లగా కామారెడ్డి ఎస్సై గోవింద్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. నిన్న రాత్రి ఎస్సై గోవింద్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకు డిఎస్పీ కార్యాలయంలో విచారణ జరిపారు.
విచారణ అనంతరం ఎస్సై గోవింద్ అరెస్ట్ వివరాలు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు వివరించారు. క్రికెట్ బెట్టింగ్ విషయంలో సిఐ జగదీష్ తో పాటు ఎస్సై గోవింద్ కూడా బాధితుడు సుధాకర్ ను 20 వేలు లంచం అడిగారని ఏసీబీ డిఎస్పీ తెలిపారు.
సిఐ తీసుకున్న లంచం విషయంలో ఎస్సైకి సంబంధం లేదని తెలిపారు. 20 వేలు లంచం డిమాండ్ చేసిన విషయమై ఆధారాలు సేకరించి ఎస్సైని అరెస్ట్ చేయడం జరిగిందని, నేడు ఆయనను కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించడం జరిగిందని డిఎస్పీ వివరించారు.
డిఎస్పీపై అక్రమ ఆస్తులపై విచారణ
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ విషయంలో డిఎస్పీ లక్ష్మినారాయణకు సంబంధం లేదని ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. దర్యాప్తు సమయంలో అక్రమ ఆస్తులకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు లభించాయని, వాటి ఆధారంగా డిఎస్పీపై అక్రమ ఆస్తుల విషయంలో విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.