సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో DSR ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై గల గుంతలో చేపలు పడుతూ వింత నిరసన చేపట్టారు. దుమ్మూ, ధూళికి కేరాఫ్ అడ్రస్గా అస్తవ్యస్తమైన రోడ్లు, పైప్ లైన్ లీకేజీలు, అడుగడుగునా గుంతలు, కనిపిస్తున్నా అధికారులు ఆదమరచి నిద్రిస్తున్నారని ఆరోపించారు.
పట్టణంలోని ప్రధాన రహదారిపైకి రావాలంటే జనాలు భయపడుతున్నారన్నారు. ప్రధాన రహదారిపై మధ్యలో వాటర్ పైపు లైన్ ఉండడంతో నిరంతరం లీకేజీలు దినచర్యలో భాగంగా మారాయని వాపోయారు. దీనివ్లల పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, రోడ్లపై నీరు నిల్వ ఉంటుందని రోడ్లు పాడయ్యాయని బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని, పట్టణంలో ఒకప్రక్కన రోడ్డు మీద వాటర్, మరొక ప్రక్క దుమ్ము, ధూళితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దుమ్ము, ధూళి కారణంగా పట్టణ ప్రజలకు అనేక చర్మ రోగాలు, ఊపిరితిత్తుల సంబంధిత రోగాల బారిన పడుతున్నారని, రోడ్డుపై ప్రమాదాలకి గురి అవుతున్నారని, పైప్ లైన్ లీకేజ్ వల్ల ఇండ్లలో తాగు నీరు రాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు పట్టించుకొని గుంతలను, దుమ్ముని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు ఆధ్వర్యంలో పైప్ లైన్ లీకేజ్ అయినా గుంతలో చేపల గాలం వేసి నిరసన తెలియజేశారు.
ఈకార్యక్రమంలో సైదులు, వెంకటేశ్వర్లు, సూర్యం, నరసింహారావు, జానీ, సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.