తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన ఐఆర్ మరింత పెంచాలని, ఇప్పుడు పెంచిన ఐఆర్ తో ఉద్యోగులు సంతృప్తితో లేరని కామారెడ్డి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, సెక్రెటరీ సాయిలు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఉద్యోగుల పాత్ర గొప్పదని, అలాంటి ఉద్యోగులకు మంచి పీఆర్సీ, ఫిట్ మెంట్ ఇవ్వాలన్నారు. 2003 లో 8 శాతం, 2008 లో 22 శాతం, 2013 లో 27 శాతం ఐఆర్ ఇచ్చారని, ఈసారి మాత్రం కేవలం 5 శాతం ఇవ్వడంతో ఉద్యోగులు నైరాశ్యంలో ఉన్నారన్నారు.
గత 11 పిఆర్సీలలో పిఆర్సీతో పాటు ఐఆర్ ప్రకటించలేదని, ఈసారి ఐఆర్ కూడా ప్రకటించినా అది 5 శాతం మాత్రమే ఇవ్వడం శోచనీయమని తెలిపారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని, ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తలుగా ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఐఆర్ ఉండాలని కోరారు. పీఆర్సీ అమలుకు 6 నెలలు సమయం ఇచ్చారని, 2018 లో మాదిరిగా ఈసారి ఆలస్యం చేయవద్దని కోరారు. 2023 డీఎలు కూడా పెండింగులో ఉన్నాయని వాటిని కూడా విడుదల చేయాలన్నారు.
ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. సిపిఎస్ కింద లక్ష 70 వేల మంది ఉద్యోగులు ఉన్నారని, వారంతా సిపిఎస్ తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. దానికోసం ప్రత్యేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నందున ఇక్కడి ఉద్యోగులను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సాయినాథ్, శాంతయ్య, భిక్షపతి, కల్పన పాల్గొన్నారు.