ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా–అల్–కదిమి హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కదిమి నివాసమే లక్ష్యంగా సాయుధ డ్రోన్లతో దాడి జరిగిందని, ఆయనకు ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.
గత నెలలో వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఇరాన్ మద్దతుగల మిలీషియాలు తిరస్కరించడంతో తలెత్తిన ఉద్రిక్తతలకు తాజా ఘటన ఆజ్యం పోసినట్లయింది. ప్రభుత్వ ఆఫీసులు, దౌత్య కార్యాలయాలతో అత్యధిక భద్రతా ఏర్పాట్లుండే గ్రీన్ జోన్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ దాడిలో కదిమి భద్రతా సిబ్బంది ఏడుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. దాడి అనంతరం దేవుని దయవల్ల నేను, నా ప్రజలు క్షేమంగా ఉన్నామని ప్రధాని కదిమి ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా, దాడికి బాధ్యత తమదేనంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఇరాక్ ప్రధానిపై డ్రోన్ దాడిని అమెరికా, ఈజిప్టు, యూఏఈ ఖండించాయి.